.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని. పట్టించుకోని కాంగ్రెస్ అధిష్టానం
.. ఢిల్లీ లో ఉండగానే రేవంత్ పేరు ప్రకటన
By: K. AshokReddy,
Sr. Journalist,
ఏఆర్ మీడియా/ ఏసీయన్ మీడియా,
హైదరాబాద్ :జూన్ 27
ఇక కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి ప్రస్థానం ముగిసినట్లే.. రాష్ట్ర పిసిసి పీఠాన్ని ఆశించిన కోమటిరెడ్డి తీరా ఆ పదవి దక్కకపోవడంతో కమలం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిజెపి జాతీయ నేతలను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రీజనల్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు ఎంతో కృషి చేస్తున్నారని మెచ్చుకుంటున్నారు. ప్రధానంగా గడ్కరీ, రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి అధికంగా నిధులు మంజూరు చేస్తూ కొత్త ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నారని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు
. పిసిసి పీఠాన్ని ఆశించి భంగపడిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిజెపి జపం చేస్తున్నారని అనడానికి, ఆయన, తాజాగా చేసిన వ్యాఖ్యానాలు రుజువు చేస్తున్నాయి. మొదటి నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీలో కొరకరాని కొయ్యగా మారిన విషయాన్ని కేంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పసిగట్టింది. వీరికి పార్టీలో పదవులు ఇస్తే అగమ్యగోచరంగా తయారవుతుంది అని భావించి, పక్కన పెట్టినట్లు సమాచారం.
భంగపడ్డ వెంకటరెడ్డి:
రాష్ట్ర పిసిసి పదవిని ఆశించి ఢిల్లీలో తిష్ట వేసినప్పటికీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దగా విశ్వాసంలోకి తీసుకోలేదు. ఎన్నో రకాలుగా ప్రయత్నించినప్పటికీ పిసిసి పీఠం బలమైన నాయకుడిగా ముద్రపడిన రేవంత్ రెడ్డి వైపే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. కోమటిరెడ్డి ఢిల్లీ లో ఉండగానే పి సి సి అధ్యక్షుడు నియామక ఉత్తర్వులను విడుదల చేయడం ఆయనకు చెంపపెట్టు గా మారింది
. దీనిపై పెద్ద రాద్ధాంతం చేస్తూ వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యానాలు ఆయన రాజకీయ పరిపక్వతను తెలియజేస్తున్నాయి. చాలా కాలం నుంచి పార్టీలో పని చేసి, పదవులు రానప్పుడు కూడా పార్టీకి వెన్నంటి ఉండేవాడే నాయకుడు అవుతారు. కానీ పదవులు రాలేదని ఇష్టారీతిన వ్యవహరిస్తే రాజకీయంగా ఎవరి గొయ్యి, వారు తవ్వుకున్నట్లే అనే విషయాన్ని కోమటిరెడ్డి తెలుసుకోకపోవడం ఆయన పరిజ్ఞానాన్ని చెప్పకనే చెబుతుంది.
మొదటినుంచి వివాదాస్పద బ్రదర్స్:
కాంగ్రెస్ పార్టీలో ముదటి నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ వివాదాస్పదంగా మెదులుతూ వస్తున్నారు. రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఎవరు ఉన్నా, వారిని, వ్యతిరేకించడం పరిపాటిగా వస్తోంది. ఇప్పటివరకు పిసిసి అధ్యక్షుడిగా కొనసాగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే
. పైగా గత కొంతకాలం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో తాను చేరుతానని బహిరంగంగా ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మాదిరిగానే బిజెపి పాట పాడుతున్నారు. అయితే బీజేపీ వీరిని చేర్చుకోవడం పై కూడా ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
బీజేపీ నేతలతో మాటామంతి :
ఇన్నాళ్లు రాష్ట్ర పిసిసి పీఠం పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశ పెట్టుకోవడం, అది కాస్త దక్కకపోవడంతో ఢిల్లీలోని బీజేపీ నేతలతో మాటామంతి జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పిసిసి పీఠం వస్తుందనే ఆశతో ఎదురు చూస్తే, అది కాస్త, అందకపోవడంతో బిజెపిలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బిజెపికి అనుకూలంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన అనుకూల ప్రకటన నేపథ్యంలో బిజెపిలో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. రానున్న కొద్ది రోజుల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏ పార్టీలో ఉండబోతుందని అంశం తేలనుంది.
Comments
Post a Comment