బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న ఈటెల రేపో మాపో చేరిక ...!. .
AR Media/Asian Media
By: K. AshokReddy, Sr. Journalist.
Published 25.5.2021, 6.50pm.
బీజేపీలోకీ ఈటల
..బిజెపి నేతలతో వరుస భేటీలు
...తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో చర్చలు
... కేసుల భయంతోనే బిజెపి పంచన
....అన్ని రకాల సేఫ్ సైడ్ తో పక్క ప్లాన్.
: రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన రాజకీయ భవితవ్యంపై ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. గత 25 రోజుల నుంచి కాంగ్రెస్ బిజెపి నేతలతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులను చర్చిస్తున్నప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. ఒకపక్క సీఎం కేసీఆర్ అత్యంత బలవంతుడు కావడంవల్ల తన రాజకీయ భవిష్యత్తును పక్కాగా మలుచుకునేందుకు బిజెపి సరైన రాజకీయ మార్గంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ముఖ్యమంత్రి కేసీఆర్ రోజుకో రకంగా భూ కబ్జా కేసులు, కుట్ర కోణం, బెదిరింపులు, హత్యాయత్నాలు, ప్రభుత్వ కూల్చివేత కుట్రల కేసులను బనాయించేందుకు రంగం సిద్ధం చేస్తున్న విషయం విదితమే. అయితే ఈ కేసులన్నిటిని ఎదుర్కొనేందుకు రక్షణ కవచం కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవ్వగలరని గట్టిగా భావిస్తున్నారు.
ఇందుకు ఆయన కుటుంబ సభ్యులు సైతం కేసులలో ఇబ్బందులు పడకుండా బిజెపి లో చేరడమే శ్రేయస్కరమని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరినైనా టార్గెట్ చేస్తే వారిని రాజకీయంగా ఖతం చేసేవరకూ ఊరుకోరని, ఈ విషయాన్ని ఈటల రాజేందర్ స్వయంగా ప్రస్తావించడం గమనార్హం.
సీఎం కేసీఆర్ మనస్తత్వం తెలిసిన ఈటల రాజేందర్, ఈ కేసుల నుంచి బయటపడాలంటే బిజెపి శరణ్యంగా భావిస్తున్న ట్లు ఆయన వేస్తున్న అడుగులను బట్టి తెలుస్తోంది.
ఇందులో భాగంగానే బిజెపి నేతలతో వరుస సమావేశాలతో చర్చోప చర్చలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో బిజెపి సీనియర్ నేతలైన జితేందర్ రెడ్డి, డీకే అరుణ లతో సమావేశమై రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించిన విషయం విదితమే. గతంలో కూడా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో కూడా ఫోన్లో మాట్లాడారు. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తో సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది.
కేంద్రం అండగా ఉంటుంది:
ఆంధ్రప్రదేశ్ ఎంపీ రఘురామకృష్ణారాజును ఎపి సీఎం జగన్ ఎన్ని కేసులు పెట్టిన కేంద్ర ప్రభుత్వం అండతో నిలబడగల్గుతున్నారు. పెట్టిన కేసులన్ని కుట్ర పూరితమని చెప్పే అవకాశం వచ్చింది. సుప్రీమ్ కోర్ట్ అండ కూడా లభిస్తుంది. ఈ మాదిరిగానే
బిజెపిలో చేరితే కేంద్ర ప్రభుత్వం ఈటలకు అండగా ఉంటుంది. ఇలాంటి అనేక రకాల అంశాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈటెల కు భరోసా ఇచ్చినట్లు తెలిసింది. సీఎం కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు బీజేపీతో కలిసి రావాలని కిషన్ రెడ్డి సూచించారు
. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టే కేసులపై కూడా పార్టీపరంగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని నచ్చజెప్పారు. భవిష్యత్తులో పార్టీలో మంచి ప్రాముఖ్యత ఉంటుందని, కలిసి పని చేస్తే అంతా మంచే జరుగుతుందని కిషన్ రెడ్డి సూచించినట్లు సమాచారం.
ఉపఎన్నికలో ఈజీగా గెలుపు:
హుజరాబాద్ లో వచ్చే ఉప ఎన్నికల్లో బిజెపి తరఫున పోటీ చేస్తే గెలుపు సునాయాసం అవుతుందని కిషన్ రెడ్డి ఈటలకు వివరించినట్లు తెలిసింది. ఒకవేళ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే బిజెపి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని, ఒక జాతీయ పార్టీగా పోటీ చేస్తామని వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఓట్లు చీలిపోవడం వల్ల అధికార పార్టీకే మళ్లీ లాభం జరుగుతుందని కిషన్ రెడ్డి గ్రౌండ్ రిపోర్ట్ మొత్తం వివరించినట్లు సమాచారం
. ఇలా అన్ని అంశాలపై ఇరువురు నేతలు చేసిన చర్చల్లో సానుకూలమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లు తెలిసింది. ఈటల అనుయాయులు కూడా సీఎం కేసీఆర్ ను ఎదుర్కోవాలి అంటే బిజెపి లో చేరడం మంచిదని చెబుతున్నారు. మొత్తం మీద ఈటల రాజేందర్ కూడా త్వరలో తన రాజకీయ భవితవ్యంపై నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
Comments
Post a Comment