భారత్ లో 40 కోట్ల ప్రజలకు వైరస్ ముప్పు
*68% మందిలో కరోనా యాంటీబాడీలు*
ఇంకా 40 కోట్ల ప్రజలకు వైరస్ ముప్పు
*ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ వెల్లడి*
ఏషియన్ మీడియా నెట్వర్క్
న్యూ ఢిల్లీ :జులై22
దేశంలో ఇప్పటివరకు మూడింట రెండొంతుల మంది కొవిడ్కు గురైనట్లు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు. దేశంలోని 21 రాష్ట్రాల్లోని 70 జిల్లాల్లో జూన్-జులై నెలల్లో నిర్వహించిన నాలుగో సీరో సర్వేను అనుసరించి ఈ విషయం వెల్లడిస్తున్నట్లు ప్రకటించారు
. ఇదివరకు నిర్వహించిన మూడు సర్వేలకు భిన్నంగా ఈసారి 6-17 ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లలు సహా మొత్తం 28,975 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించినట్లు చెప్పారు. ఇందులో పాల్గొన్న పెద్దల్లో 12,607 మంది (62.2%) ఎలాంటి టీకా తీసుకోలేదని, 5,038 మంది (24.8%) ఒక డోసు, 2,631 మంది (13%) రెండు డోసులు తీసుకున్నట్లు తెలిపారు
. మొత్తంగా 67.6% మందిలో యాంటీబాడీలు కనిపించినట్లు చెప్పారు. 6-9 ఏళ్ల వయస్సులో 57.2%మందిలో, 10-17 ఏళ్ల వయస్సులో 61.6%, 18-44 వయస్సులో 66.7%, 45-6 ఏళ్ల వయస్సులో 77.6%, 60 ఏళ్ల పైబడిన వారిలో76.7% మందిలో యాంటీబాడీలు ఉన్నాయన్నారు. పురుషుల్లో 65.8% మందిలో సీరో పాజిటివిటీ రేటు కనిపించగా మహిళల్లో 69.2% మందిలో కనిపించినట్లు చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో 66.7%, పట్టణ ప్రాంతాల్లో 69.6% మందిలో యాంటీబాడీలను గుర్తించినట్లు చెప్పారు. ఇప్పటివరకు టీకా తీసుకోని వారిలో 62.3% మందిలో, ఒక డోసు తీసుకున్నవారిలో 81% మందిలో, రెండు డోసులు తీసుకున్నవారిలో 89.%మందిలో యాంటీబాడీలు ఉన్నాయని బలరాం భార్గవ వివరించారు. వైద్య ఆరోగ్య సిబ్బందిలో 85.2%మందిలో సీరో పాజిటివిటీ కనిపించిందని చెప్పారు
. ఈ ఫలితాలను బట్టి చూస్తే.. ఇప్పటి వరకు మూడింట రెండొంతుల మంది కొవిడ్కు గురైనట్లు తెలుస్తోందని, ఇంకా 40 కోట్ల మందిలో యాంటీబాడీలు కనిపించనందున వారందరూ వైరస్ బారిన పడడానికి అవకాశం ఉందన్నారు. యాంటీబాడీలు తక్కువ ఉన్న ప్రాంతాల్లో కేసులు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం కనిపించిన సీరో పాజిటివిటీ రేటు ఆశాజనకంగానే ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలని స్పష్టంచేశారు
. అదే సమయంలో జాతీయస్థాయిలో నిర్వహించిన ఈ సర్వే స్థానిక పరిస్థితులను వెల్లడించలేదని, అందువల్ల రాష్ట్రాలు సొంతంగా సీరో సర్వే నిర్వహించుకోవాలన్నారు. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ మాట్లాడుతూ ఇప్పటివరకు యాంటీబాడీలు కనిపించని 40 కోట్ల మంది ఇన్ఫెక్షన్ ద్వారా కాకుండా టీకా తీసుకోవడం ద్వారా వాటిని తెచ్చుకోవాలని సూచించారు
. ఇప్పటికీ ప్రతి ముగ్గురిలో ఒకరు కొవిడ్-19కు గురవడానికి అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలన్నారు.
Comments
Post a Comment